IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!

India Afghanistan

India Afghanistan

India vs Afghanistan T20 Series: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య వచ్చే నెల నుంచి జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ క్రికెట్ ప్రపంచంలో ఒక అరుదైన ఘట్టానికి వేదిక కాబోతోంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక జట్టు (భారత్) తన సొంత గడ్డపైనే ‘అతిథి’ (గెస్ట్)గా ఆడనుండగా, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ సిరీస్‌కు ఆతిథ్యమివ్వనుంది. అయితే, సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సిరీస్ మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే తీవ్ర వివాదంలో చిక్కుకున్నాయి. ఈ టీ20 సిరీస్‌కు సంబంధించిన కమర్షియల్, టీవీ ప్రొడక్షన్ హక్కులను అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ‘ట్రాన్స్‌గ్రూప్’ (TransGroup) అనే పాకిస్థానీ సంస్థకు అప్పగించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఈ సంస్థ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)లతో చాలా కాలంగా దగ్గరి సంబంధాలు కలిగి ఉంది.

ఆగస్టు 12న ఈ సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసిన సందర్భంలో అఫ్గానిస్థాన్ బోర్డు తమ భాగస్వాముల వివరాలను అధికారికంగా వెల్లడించింది. దీని ప్రకారం.. ‘వాణి’ (Vany) సంస్థ ACB క్లోథింగ్ పార్ట్‌నర్‌గా కొనసాగనుండగా, ‘ట్రాన్స్‌గ్రూప్’ (TG) గ్లోబల్ మీడియా రైట్స్ సిండికేషన్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తుంది. అలాగే ‘TPT360’ మీడియా ప్రొడక్షన్ పార్ట్‌నర్‌గా, భారత్‌లో ప్రసారాల కోసం ‘ఫ్యాన్‌కోడ్’ (FanCode) ఆఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌గా ఉంటాయి. గత కొన్నేళ్లుగా అఫ్గానిస్థాన్ తన హోమ్ మ్యాచ్‌లను విదేశీ మైదానాల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలోని లక్నో, డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడాతో పాటు యూఏఈ (UAE) కూడా అఫ్గానిస్థాన్‌కు హోమ్ గ్రౌండ్స్‌గా వ్యవహరించాయి. అందువల్లే భారత్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నా, అఫ్గానిస్థాన్ ఇక్కడ ఆతిథ్య జట్టుగా నిలుస్తోంది.

ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. సెప్టెంబర్ 13న తొలి టీ20, 15న రెండో టీ20, 17న మూడో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ఏడాది జూన్‌లోనే అఫ్గానిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించి ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడింది. ధర్మశాల, లక్నో, చెన్నైలలో జరిగిన వన్డేల్లో విజయం సాధించడంతో పాటు ముల్లాంపూర్‌లో జరిగిన ఏకైక టెస్టులోనూ టీమిండియా అఫ్గాన్‌పై ఘన విజయం సాధించింది.