Site icon NTV Telugu

Karnataka Polls: కర్ణాటక ఎన్నికలు.. నామినేషన్లలో ఆసక్తికర ఘటనలు

Karnataka Polls

Karnataka Polls

Karnataka Polls: కర్ణాట‌క విధాన‌స‌భ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. యాద్గిర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి యంక‌ప్ప అనే యువ‌కుడు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే నామినేష‌న్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో స‌మ‌ర్పించిన డిపాజిట్ కింద అన్నీ రూపాయి నాణేల‌ను స‌మ‌ర్పించాడు యంకప్ప. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికి తిరిగి రూపాయి నాణేల‌ను సేకరించిన ఆయన… వాటిని తన నామినేషన్‌తోపాటు డిపాజిట్‌ సొమ్ము కింద జమ చేశాడు. అయితే ఆ నాణేల‌ను ఎన్నిక‌ల అధికారులు రెండు గంట‌ల పాటు లెక్కించాల్సి వ‌చ్చింది.

Read Also: APPSC Group 1 and Group 2: గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ప్రణాళిక

ఇక హొసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మంత్రి MTB నాగరాజు దాఖలు చేసిన అఫిడవిట్‌లో… తనకు 16 వందల 9 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. MTB నాగరాజు కేవలం తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తన అఫిడవిట్‌లో కనబర్చిన 16 వందల 9 కోట్ల ఆస్తుల్లో తన భార్య పేరు మీద 536 కోట్ల చరాస్తులు, వెయ్యి 73 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా 2018 ఎన్నికల్లో తన ఆస్తిని వెయ్యి 120 కోట్లుగా ప్రకటించారు MTC నాగరాజు. అప్పటితే పోలిస్తే ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తులు 500 కోట్లు పెరిగాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. ఎల్లుండి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 24తో నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగియనుంది. వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు రేపటితో గడువు ముగియనుండటంతో… ఈ రెండు రోజుల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version