Virat Kohli Brother Vikas Kohli React on mother illness: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లోని తొలి రెండు టెస్ట్ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా మొదటి రెండు టెస్టుల నుంచి విరామం కోరాడని, మిగిలిన మూడు టెస్టులకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈవార్తలపై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరాడు.
బుధవారం వికాస్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పోస్ట్ చేశాడు. ‘అందరికీ నమస్కారం. మా అమ్మ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని గమనించాను. మా అమ్మ ఆరోగ్యంగా, పూర్తిగా ఫిట్గా ఉన్నారు. సరైన సమాచారం లేకుండా అలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ మరియు మీడియాను కూడా అభ్యర్థిస్తున్నా’ అని వికాస్ కోహ్లీ తన పోస్ట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.
Also Read: Kumari Aunty: కుమారి ఆంటీకి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే స్టాల్ను సందర్శిస్తా..!
ఇంగ్లండ్తో హైదరాబాద్లో జరిగిన మొదటి టెస్టులో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ వైఫల్యం టీమిండియాకు విజయాన్ని దూరం చేసింది. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ లేని లోటు భారత జట్టులో స్పష్టంగా కనిపించింది. మొదటి టెస్టులో బాగా ఆడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాలతో రెండో టెస్టుకు అందుబాటులో లేరు. శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ల పూర్ ఫామ్ భారత జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. చివరి మూడు టెస్ట్లకు ఈరోజు భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది.