West Bengal: “10 నిమిషాల్లో భారత్లోకి వచ్చేశాం”.. ఆధార్, ఓటర్ ఐడీలు ఎలా వచ్చాయో చెప్పేసిన బంగ్లాదేశ్ వలసదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన, మునుపెన్నడూ చూడని వాతావరణం కనిపిస్తోంది. పట్టుబడితే నిర్బంధ కేంద్రాలకు (డిటెన్షన్ సెంటర్లు) పంపుతారనే భయంతో వందలాది మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సరిహద్దులు, రవాణా కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. వీరిలో దశాబ్దాలుగా, మరికొందరైతే తమ జీవిత కాలమంతా ఇక్కడే ఉండిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల వల్ల తాము అక్రమంగా భారతదేశంలోకి ఎలా ప్రవేశించామో, ఇక్కడి గుర్తింపు పత్రాలను ఎలా సంపాదించామో కొందరు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. కొందరు నదులు దాటి భారత్లోకి వస్తే, మరికొందరు చీకటిని ఆసరాగా చేసుకుని ‘దలాల్’ అనే మధ్యవర్తుల సాయంతో సరిహద్దులు దాటామని చెప్తున్నారు. సరిహద్దుల్లో భద్రతా దళాల పహారా కాసేపు పక్కకు మారిన వెంటనే, కేవలం పది నిమిషాల్లోనే భారత్లోకి చొరబడటం చాలా సులువు అని ఒక వలసదారుడు బయటపెట్టడం గమనార్హం.
ఈ పరిణామాల వెనుక పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారులపై జరుగుతున్న తీవ్రమైన నిఘా, కఠిన చర్యలు ఉన్నాయి. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు ఎలాంటి ఆశ్రయం ఇవ్వకూడదని, వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టకుండా నేరుగా సరిహద్దు భద్రతా దళానికి (BSF) అప్పగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బెంగాల్లో అక్రమ వలసదారులు పొందుతున్న సంక్షేమ పథకాలను గుర్తించి, వాటిని నిలిపివేస్తున్నట్లు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దు జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం కావడంతో, జైలుపాలు కావడం లేదా బలవంతపు బహిష్కరణకు గురికావడం కంటే స్వచ్ఛందంగా బంగ్లాదేశ్కు తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు. వందలాది మంది ఇలా స్వదేశానికి తిరిగి వెళ్తుండటంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం స్పందిస్తూ, చొరబాటుదారులు తమంతట తామే తిరిగి వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు. అలాగే చికెన్ నెక్ ప్రాంతంతో సహా సుమారు 600 హెక్టార్ల భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించినందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆయన అభినందించారు.
Also Read
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
- Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Indian Railways Food Prices: రైల్వే ప్రయాణికులకు షాక్.. వాటి ధరల పెంపు.! జూన్ 1 నుంచి అమల్లోకి..
ఇలా వెనుదిరుగుతున్న కొందరు అక్రమ చొరబాటుదారులు భారత్లోకి తాము ఎలా ప్రవేశించామో వివరించిన తీరు సంచలనం సృష్టిస్తోంది. బంగ్లాదేశ్లోని కుష్టియా జిల్లాకు చెందిన ఒక వడ్రంగి మాట్లాడుతూ, తాను ఒక మధ్యవర్తికి రూ.7,000 నుంచి రూ.8,000 వరకు చెల్లించానని, ఆ ఏజెంట్ రాత్రిపూట బీఎస్ఎఫ్ సిబ్బంది కదలికలను నిశితంగా గమనించి, పహారాలో కాస్త గ్యాప్ దొరికినప్పుడల్లా జనాలను సరిహద్దులు దాటించేవాడని చెప్పాడు. బెంగళూరులో నివసిస్తున్న మరో వలసదారుడు, సరిహద్దుల్లో సైన్యం పహారా కాస్తున్నప్పటికీ ఒక ఏజెంట్కు రూ. 20,000 ఇచ్చి దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపాడు. కుష్టియా నుంచి తన సోదరులతో కలిసి వచ్చిన ఒక వ్యక్తి ‘హల్దియా లైవ్’ అనే స్థానిక యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడుతూ, తాము కేరళలో పనిచేశామని, అయితే ఇప్పుడు కనీసం అద్దెకు గది ఇవ్వాలన్నా ఓటరు కార్డు, ఆధార్ కార్డు అడుగుతుండటంతో అవి లేక తిరిగి వెళ్ళిపోతున్నట్లు చెప్పాడు. రాత్రి వేళల్లో సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ లేని ప్రాంతాలను గుర్తించి, అవకాశం దొరికిన వెంటనే మనుషులను దాటిస్తారని, కొన్నిసార్లు రాత్రంతా వేచి ఉండాల్సి వస్తే, మరికొన్నిసార్లు కేవలం 10 నిమిషాల్లోనే పని అయిపోతుందని అతను వివరించాడు. బెంగళూరుకు చెందిన మరో వలసదారుడు సైతం ఇలాగే కేవలం రూ. 2,000 ఆ ఏజెంట్కు ఇచ్చి సరిహద్దు దాటామని, ఆ తర్వాత మరో రూ. 2,000 నుంచి రూ. 3,000 ఖర్చు చేసి ఆధార్ కార్డు సంపాదించి, రైలులో బెంగళూరు చేరుకున్నామని చెప్పాడు.
నకిలీ పత్రాల తయారీ గురించి ఒక బంగ్లాదేశ్ మహిళా వలసదారు ‘ఏబీపీ న్యూస్’తో మాట్లాడుతూ, గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక రాజకీయ నాయకులు తనకు ఓటరు కార్డు, రేషన్ కార్డు ఇప్పించారని, అలాగే తాము రెండేళ్లుగా ‘లక్ష్మీర్ భండార్’ పథకం ద్వారా నగదు ప్రయోజనాలు సైతం పొందామని సంచలన విషయం బయటపెట్టింది. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఇప్పుడు అందరూ తమ వెంటే పడుతున్నారని మరో వలసదారుడు వాపోయాడు. బంగ్లాదేశ్ ప్రజలకు ఇళ్లు అద్దెకు ఇస్తే రూ. 2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష పడుతుందనే భయంతో యజమానులు తమను ఖాళీ చేయిస్తున్నారని అన్నాడు. తాను ఒకసారి భారత్లో ఓటు సైతం వేశానని, తన భార్య లక్ష్మీర్ భండార్ పథకం డబ్బులు అందుకుందని అతను ఒప్పుకున్నాడు.
ఇలా బంగ్లా నుంచి అక్రమంగా వచ్చిన వారిలో ఒకడైన సలామ్ దాలీ ఐదేళ్లుగా భారత్లో వడ్రంగి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పారిపోయేందుకు తన భార్య పిల్లలతో కలిసి హకీంపూర్ సరిహద్దు వద్ద వేచి ఉన్నాడు. భారత్లోకి అక్రమంగా ఎలా వచ్చాడనే అంశంపై సలామ్ మాట్లాడుతూ, తాము ఖుల్నా జిల్లా నుంచి ఐదేళ్ల క్రితం రూ. 8,000-10,000 ఇచ్చి వచ్చామని చెప్పాడు. మరొక యువకుడు మాట్లాడుతూ, తనకు పదేళ్ల వయసున్నప్పుడే తన తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకువచ్చారని, తండ్రి వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడని, అప్పట్లో ఎవరూ ఏమీ అనలేదని గుర్తుచేసుకున్నాడు. ఖుల్నాకు చెందిన తక్లీమా ఖాతూన్ అనే మహిళ రెండేళ్ల క్రితం ఘోజాదంగ సరిహద్దు ద్వారా వచ్చి ఇళ్లల్లో పనిమనిషిగా చేరానని, జైలు భయంతో ఇప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నానని ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధికి తెలిపింది. సత్ఖిరాకు చెందిన షాహిదుల్ గాజీ అనే మేస్త్రీ కూడా మూడేళ్ల క్రితం స్వరూప్నగర్ సరిహద్దు నుంచి వచ్చానని, భారతీయ పౌరసత్వ పత్రాలు లేకపోవడంతో ఇప్పుడు వెనుదిరగక తప్పడం లేదని చెప్పాడు. ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల సాక్ష్యాలను బట్టి చూస్తే, ఇది కేవలం సరిహద్దు భద్రతకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని స్పష్టమవుతోంది. దీని వెనుక మధ్యవర్తులు, నకిలీ పత్రాల తయారీదారులు, రాజకీయ శక్తులతో కూడిన ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ఇది రాజకీయ వివాదాలకు అతీతంగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై, సంక్షేమ వనరులపై, దేశ భద్రతపై ఎంతటి అదనపు భారాన్ని మోపిందో ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
-
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
-
Vaibhav vs Kohli: 2016లో విరాట్ కోహ్లీ, 2026లో వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప..!
-
Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
-
TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!