డిజాస్టర్ మేనేజ్మెంట్పై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్మెంట్)పై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష చేశారు. బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బెంగళూరుతో పాటు.. దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమన్వయంతో మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో అనుసరిస్తున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ విధానాలను మరింత సమర్థవంతంగా, సమన్వయంగా రూపొందించడం, ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి.. యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచడం వంటి చర్యలపై సమీక్షలు చేశారు.
అంతేకాకుండా.. ‘వాతావరణ కాలుష్యం, ఇతర కారణాలతో నెలలో పడే వర్షం ఒక్క రోజులో.. ఒక్క రోజులో పడే వర్షం గంట, అరగంటలో కురవడంతో తలెత్తుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేలా చర్యలు. ప్రాంతాలవారీ వెదర్ రిపోర్టు ప్రజలకు చేరేలా చర్యలు, ఎంత వర్షం పడుతుందో, వరద ముప్పు, వడగళ్లతో పాటు పిడుగుపాట్ల హెచ్చరికలు కూడా ప్రజలకు తెలిసేలా చర్యలు. గ్రేటర్హైదరాబాద్ పరిధిలో డివిజన్ల వారీ వెదర్ స్టేషన్ల నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించి వర్షపాత నమోదును, వరద ముప్పును అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడం. రహదారుల్లో కిలోమీటర్ల మేర వర్షపు నీరు ప్రవహించకుండా ఎక్కడికక్కడ వదర నీటి కాలువల్లోకి నీరు చేరేలా చూడడం. వరదలు, ముంపు సంభవిస్తుందని గ్రహించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో వరద నీటి కాలువల ప్రవాహ స్థాయిని అంచనా వేసేందుకు బెంగళూరులో అమర్చిన సెన్సార్ల ప్రయోజనాలపై సమీక్ష. అలాగే నాలాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు. ప్రస్తుతం నగరంలో ఉన్న చెరువులన్నిటికీ అలుగులుండేలా.. చెరువు నిండితో అలుగు ద్వారా ఇంకో చెరువుకు చేరడం. గొలుసుకట్టు చెరువుల లింకును పునరుద్ధరించి వరద సాఫీగా సాగేందుకు చర్యలు.’ వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించారు.