హైదరాబాద్ నగరవాసులకు ఒక అద్భుతమైన వార్త.. మల్టీప్లెక్స్ల ఏసీ గదుల్లో సినిమా చూసే బోర్ కొట్టే రొటీన్కు చెక్ పెడుతూ.. పచ్చని ప్రకృతి ఒడిలో, ఆకాశం కింద సినిమా చూసే ‘ఓపెన్ ఎయిర్ థియేటర్’ అనుభవం మళ్లీ మన ముందుకు రాబోతోంది. నాంపల్లిలోని చారిత్రక పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న ‘లలిత కళాతోరణం’ ఇందుకు వేదిక కానుంది. నగర ప్రజలకు ఉచితంగా వినోదాన్ని పంచాలనే లక్ష్యంతో తెలంగాణ పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
సినిమా ప్రదర్శనల వివరాలు..
ఓటీటీలు, మొబైల్ ఫోన్ల కాలంలో పాతకాలపు ఓపెన్ ఎయిర్ సినిమా సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేయడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఇందుకోసం లలిత కళాతోరణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్ను, అధునాతన సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలు ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభమవుతాయి.
ప్రదర్శించబోయే చిత్రాలు..
నేడు కోర్టు సినిమాను ప్రదర్శించగా.. రేపు (ఏప్రిల్ 16)న తండేల్ సినిమాను ప్రదర్శించనున్నారు. ఏప్రిల్ 17న ‘బలగం’.. తెలంగాణ పల్లె సంస్కృతిని, కుటుంబ బంధాలను ఎంతో భావోద్వేగంగా చూపించిన అవార్డ్ విన్నింగ్ చిత్రం ‘బలగం’. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించే ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూడటం గొప్ప అనుభూతినిస్తుంది.
ఏప్రిల్ 18న ‘జనతా గ్యారేజ్’: పర్యావరణ పరిరక్షణ అనే సందేశంతో పాటు కమర్షియల్ హంగులు ఉన్న ‘జనతా గ్యారేజ్’ సినిమాను 18వ తేదీన ప్రదర్శించనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.
ఎంట్రీ ఫీజు లేదు..
ఈ సినిమాలను చూడటానికి ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. టికెట్ల గోల, క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా నేరుగా పబ్లిక్ గార్డెన్స్కు చేరుకుని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు. వీకెండ్ సమయంలో మాల్స్కు వెళ్లడం కంటే, ఇలా అందరితో కలిసి వినూత్నంగా సినిమా చూడటం ఒక సరికొత్త అనుభవంగా మారుతుంది. కళాభిమానులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ వారాంతాన్ని కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకోండి!