Goutham Rao : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రావు ఓటమి అనంతరం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తన కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకుందని ఆరోపిస్తూ, ఎలక్షన్ కమిషన్ ముందు ఈ విషయాన్ని ఉంచనున్నట్లు తెలిపారు.
“ఓటు వేయొద్దని మీ పార్టీ నేతలే చెబితే, మీరు రేపు ప్రజలను ఓటు వేయమని ఎలా అడుగుతారు?” అని ప్రశ్నించారు గౌతమ్ రావు. అలాగే, ఎంఐఎం పార్టీ చేతుల్లో కాంగ్రెస్ పనిచేస్తోందని, ఈ ఎన్నికల ఫలితంతో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని స్పష్టమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఈ రహస్య ఐక్యతను గుర్తించాలి అని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, తనకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు గౌతమ్ రావు. అంతేగాక, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను, వారి అధిష్ఠానమే అడ్డుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
అయితే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ఉల్ హాసన్ 63 ఓట్లతో గెలిచారు, కాగా గౌతమ్ రావు 25 ఓట్లు మాత్రమే పొందారు. బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరంగా ఉండటంతో, ఈ ఎన్నికలు రాజకీయంగా హాట్టాపిక్గా మారాయి.