Hyderabad: హైదరాబాద్ ఐటీ హబ్గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని ప్రముఖ ‘రాయల్ స్పైస్’ రెస్టారెంట్లో తాజాగా జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నగర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. బయటకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ హోటల్ లోపలి అసలు రంగు చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే నోరెళ్లబెట్టారు. విలాసవంతమైన వాతావరణంలో రుచికరమైన బిర్యానీలు, కూరలు ఆరగిస్తున్నామని మురిసిపోయే కస్టమర్ల ఆరోగ్యంతో ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఎంతలా చెలగాటమాడుతుందో ఈ తనిఖీల్లో వెలుగుచూసింది.
ప్రధానంగా రెస్టారెంట్ కిచెన్లోకి అడుగుపెట్టిన అధికారులకు అక్కడ కనిపించిన దృశ్యాలు తీవ్ర అసహ్యానికి గురిచేశాయి. వంట గదిలో భారీ స్థాయిలో పురుగులు విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించాయి. ఇక వాష్ ఏరియా, కిచెన్, డైనింగ్ ప్రాంతాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎక్కడికక్కడ ఆహార వ్యర్థాలు పేరుకుపోయి, నీరు నిల్వ ఉండిపోవడంతో ఆ ప్రాంతమంతా భరించలేనంత దుర్వాసనతో నిండిపోయింది. హోటల్ గోడలు, కిటికీలు తీవ్ర అపరిశుభ్రంగా మారిపోయి, కనీస నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వంటల్లో పరిమితికి మించి రసాయనాలతో కూడిన ఫుడ్ కలర్స్ను భారీగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా, వంటల తయారీకి ఉపయోగిస్తున్న తాగునీటి నాణ్యతకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలను (Water Quality Certificates) చూపించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. వీటన్నింటికీ తోడు, వండుతున్న ఆహార పదార్థాల పక్కనే మూతలు లేని చెత్త డబ్బాలను ఉంచడం అధికారులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీనివల్ల ఆహారం కలుషితమై ప్రజలు తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న రాయల్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే కఠిన నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఈ ఘటనతో, గచ్చిబౌలి పరిసరాల్లోని మిగతా హోటల్ నిర్వాహకుల్లోనూ ఇప్పుడు వణుకు మొదలైంది.

