హుజురాబాద్ లో నామినేషన్ ల సందడి నెలకొంది. ఈరోజు నామినేషన్ల సమయం ముగిసే సరికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరపున ఈటెల జమున పేరుతో నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 8న ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజురాబాద్ లో 4వ రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరఫున ఈటెల రాజేందర్ సతీమణి జమున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ లో ఈటెల జమున ప్రతీసారీ సెంటిమెంట్ గా నామినేషన్ వేస్తారు. ఆ ఆనవాయితీని కొనసాగించడంతో పాటు ముందు జాగ్రత్తగా కూడా నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది.
ఈటెల జమున పేరుతో అరవింద్ అనే వ్యక్తి బిజెపి కార్యకర్త నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్ 2 సెట్లు, స్వతంత్ర అభ్యర్థి సైదులు 2 సెట్ల నామినేషన్ల దాఖలు చేశారు. మరో వైపు పెద్ద ఎత్తున నామినేషన్ వేసేందుకు హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లుకు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని నిరసన తెలిపారు. కోవిడ్ నిబంధనలు ప్రకారం నిరసన తెలిపేందుకు గుమిగుడారదని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో 22 మంది ఫిల్డ్ అసిస్టెంట్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయగా ఈటెల రాజేందర్ చివరి రోజు నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా రెండ్రోజుల్లో నామినేషన్ దాఖలుచేసే అవకాశం కనిపిస్తుంది. ఈనెల 8న నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈనెల 6న బతుకమ్మ పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. 11 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.. 13 న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. అకారణంగా తమను ఉద్యోగాల నుండి తొలిగించారని ఫీల్డ్ అసిస్టెంట్ లు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.