హీరో విజయ్ (Hero Vijay) సోమవారం తొలి పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సుదీర్ఘకాలం మనుగడ కొనసాగేలా.. పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం. ప్రతి ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు సభ్యత్వం తీసుకుంటారని.. వారిని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు.
అలాగే మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విజయ్ తెలిపారు. దీంతో పాటు జిల్లాల వ్యాప్తంగా పార్టీ క్యాడర్పై దృష్టి సారించాలని ముఖ్య నేతలకు సూచించారు. జిల్లాల వారిగా నమోదైన కొత్త ఓటర్ల జాబితాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీలో ఏ విషయంలోనైనా అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్ అనేలా ముందుకు సాగాలన్నారు. 2026 ఎన్నికలే టార్గెట్గా ముందుకు వెళ్లాలని శ్రేణులకు విజయ్ దిశానిర్ధేశం చేశారు.
2024లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జిల్లాల వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదుకు క్యాంపులు ఏర్పాటు చేయాలని పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశించారు. అందుకోసం పార్టీలో కొందరు మహిళలకు నియామకాలు చేపట్టాలని తెలిపారు. వీరితో ప్రత్యేకంగా మహిళా విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని అందుకు తగిన కార్యాచరణను మార్గదిర్ధేశం చేశారు.
విజయ్ ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. గత కొంత కాలంగా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నప్పటకీ వాటిని త్వరితగతిన పూర్తిచేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలోనే పార్టీ ముఖ్య సభ్యులతో కీలక సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకోవడం తమిళనాడులో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.