అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్లోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు. న్యూయార్క్ నగర మేయర్ ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపారు. మృతుల్లో స్పెయిన్కు చెందిన పైలట్, ఒక కుటుంబం ఉన్నారు. బెల్ 206L-4 లాంగ్రేంజర్ IV హెలికాప్టర్ మాన్హట్టన్ నుంచి బయలుదేరి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చుట్టుముట్టి, హడ్సన్ నది వెంబడి ఉత్తరం వైపు జార్జ్ వాషింగ్టన్ వంతెన వైపు వెళ్లింది.
Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఆ తర్వాత అది దక్షిణ దిశగా తిరిగి న్యూజెర్సీ సమీపంలో నదిలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో వాతావరణం మేఘావృతమై ఉంది, గంటకు 10 నుండి 15 మైళ్ల వేగంతో గాలులు వీచాయని తెలిపారు. ఈ సంఘటనను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ధృవీకరించింది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.