Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రోజురోజుకు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి 1,93,803 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా.. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయడం లేదు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 853.20 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 87.2476 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో.. నీటినిల్వలు క్రమంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Dowleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
శ్రీశైలం జలాశయం నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి తాజా పరిస్థితి చూస్తే.. ఇప్పుడే గేట్లు ఎత్తే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగానీ శ్రీశైలం జలాశయం నిండనుంది. అప్పుడు మాత్రమే గేట్లను ఎత్తనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రైశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని యాత్రికులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు.
దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సాగర్కు 9500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా.. 9500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 503.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 121.38 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపివేసినట్లు సమాచారం.