Srisailam Dam: పర్యటకులకు అలర్ట్‌.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేత..

  • శ్రీశైలం డ్యామ్ కు భారీగా నీటి వరద..
  • గంట గంటకు పెరుగుతోన్న ఇన్ ఫ్లో..
  • 880 అడుగులకు చేరువగా నీటిమట్టం..
  • ఈ రోజే శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అవుతోన్న అధికారులు..
Srisailam

Srisailam

Srisailam Dam: కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది నీటి ప్రవాహం పెరగడంతో.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు..? నాగార్జున సాగర్‌ నుంచి నీళ్లు ఎప్పుడు కిందికి విడుదల చేస్తారు? అని పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సమయం రానేవచ్చింది.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సాయంత్రం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్‌ శాఖ అధికారులు వెల్లడించారు.. ఇప్పటికే జలాశయానికి గంటగంటకు పెరుగుతోంది వరదప్రవాహం.. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర రివర్‌ నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి శ్రీశైలంలో చేరుతోంది..

Read Also: Stock Market Record : స్టాక్‌మార్కెట్‌లో తుపాను.. కొత్త శిఖరాగ్రానికి సెన్సెక్స్, నిఫ్టీ ఫ్యూచర్స్

దీంతో.. సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని వదలనున్నారు అధికారులు.. మొదట నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.. అయితే, ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.37 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.. మరోవైపు.. కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో.. విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62,725 క్యూసెక్కుల నీటిని వాడుతూ.. దిగువకు విడుదల చేస్తున్నారు.. శ్రీశైలం డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 877.80 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 171.8625 టీఎంసీలకు పైగా ఉంది.. సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 880 అడుగులకు చేరువగా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.