Harry Brook: నిన్న జరిగిన టీమిండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ ఎంత ఉత్కంఠకు తెరలేపిందో పెద్దగా చెప్పనవసరం లేదు. చివర క్షణం వరకు మ్యాచ్కు కోట్లాది మంది అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టు తృటిలో ఓటమి పాలై ఇంటికి పయనమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ చేసిన బిగ్ మిస్టెక్ మ్యాచ్ రూపాన్నే మార్చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ శామ్సన్ క్యాచ్ను మిస్ చేశాడు. దీంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం.. తన తప్పును బ్రూక్ ఒప్పుకున్నాడు. సంజూ శామ్సన్ ఈజీ క్యాచ్ తన చేతుల్లోంచి జారిపోవడమే మ్యాచ్ మలుపు తిరిగిన క్షణమని అంగీకరించాడు. అదే తప్పిదం చివరకు తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమైందని చెప్పాడు.
READ MORE: Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు
భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. మూడో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని సంజూ గాల్లోకి కొట్టాడు. ఆ సమయంలో అతడు కేవలం 15 పరుగుల దగ్గరే ఉన్నాడు. ఆ బంతి నేరుగా మిడ్ ఆన్ ప్రాంతంలో ఉన్న హ్యారీ బ్రూక్ వైపు వెళ్లింది. అది ఈజీ క్యాచ్. కానీ అనుకోకుండా బ్రూక్ చేతుల్లోంచి బంతి జారి నేలపై పడింది. ఆ ఒక్క క్షణమే మ్యాచ్ కథను పూర్తిగా మార్చేసింది. ఈ అవకాశాన్ని సంజూ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. లైఫ్ వచ్చిన తర్వాత వీరబాదుడు బాదాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విజృంభించాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. అతని వేగవంతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ ప్రతి సారి బౌండరీ కొట్టినప్పుడు కెమెరాలు బ్రూక్ ముఖాన్ని చూపించాయి. తన తప్పిదం ఎంత పెద్దదో అప్పుడు అతడికి స్పష్టంగా తెలిసినట్టే కనిపించింది.
