Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..

Harish Rao

Harish Rao

Harish Rao: జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పూర్తిగా త్యాగం చేశారని, కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని, కనీసం ‘జై తెలంగాణ’ అని అనని వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా నీళ్ల కోసమే వచ్చిందని గుర్తుచేసిన హరీశ్ రావు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయిందని దుయ్యబట్టారు. గతంలో 18 సార్లు జీఆర్ఎంబీ (GRMB) సమావేశాలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించినా, ఆనాడు తెలంగాణ ప్రభుత్వం వాటిని తిప్పికొట్టి అన్ని అనుమతులు సాధించిందన్నారు. కానీ నేడు చరిత్రలో తొలిసారిగా గతంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను కూడా రద్దు చేసి, రివ్యూ చేయాలనే అంశాన్ని జీఆర్ఎంబీ అజెండాలో చేర్చడం శోచనీయమన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీళ్లపై కనీస సోయి లేదని, ఇప్పటికైనా కళ్లు తెరిచి జీఆర్ఎంబీ అజెండాను మార్పించాలని, ప్రభుత్వం వద్ద చిత్తశుద్ధి ఉంటే ఆ సమావేశాన్ని తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందో స్పష్టం చేయాలన్నారు. సమ్మక్క సారక్క (దేవాదుల) ప్రాజెక్టుకు 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం దానిని ఎందుకు వదులుకుంటోందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా వరంగల్, నల్గొండ జిల్లాలకు నీరందించే ఈ ప్రాజెక్టును వదులుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. మొదట అజెండాలో లేదన్నారని, ఆ తర్వాత ఢిల్లీ మీటింగ్‌లో చేర్చారని, సమావేశానికి హాజరుకామని చెప్పి వెళ్లి సంతకాలు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వం కోర్టులలో వేసిన పిటిషన్ల నిర్వహణ రాక అట్టర్ ఫ్లాప్ అయిందని, కనీసం రిట్ పిటిషన్ వేయడం కూడా ఈ ప్రభుత్వానికి రావడం లేదని ఎద్దేవా చేశారు.