ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని ఆయన విమర్శించారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని, డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నదన్నారు. ఆహార భద్రత కార్డు, పిఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే అని, ఎన్నికలప్పుడు మభ్య పెట్టారన్నారు హరీష్ రావు. అధికారం చేజిక్కినాంక ఆంక్షలు పెట్టారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.