Site icon NTV Telugu

Harish Rao: హ్యామ్ రోడ్ల పేరిట భారీ కుంభకోణం.. ఆనాడు వద్దన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం!

Harish Rao Phone Tapping Case

Harish Rao Phone Tapping Case

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. అసెంబ్లీలో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. హ్యామ్ (HAM) రోడ్ల పేరిట సుమారు రూ.18 వేల కోట్ల స్కాం జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తే రేవంత్ రెడ్డి వద్దు అని గొడవ పెట్టారని.. ఇప్పుడు 10 శాతం మొబిలైజేషన్ ఇస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

హరీష్ రావు మాట్లాడుతూ… ‘ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం జరుగుతోంది. హ్యామ్ రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్ అండ్ బీ)లో రూ.12 వేల కోట్లు, పంచాయతీ రాజ్ డిపార్ట్​మెంట్​లో రూ.6 వేల కోట్లు కలిపి భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి వద్దు అని గొడవ పెట్టారు. ఇప్పుడు అదే ప్రభుత్వం 10 శాతం మొబిలైజేషన్ ఇస్తోంది. ఇందులో కమిషన్లు తీసుకుని ఎన్నికల ఖర్చు కోసం పంపబోతున్నారు. ఈ వ్యవహారం పెద్ద స్థాయి స్కాం గా మారే ప్రమాదం ఉంది’ అని ఆరోపించారు.

Also Read: Sanju Samson: విజయాల కంటే పరాజయాలే ఎక్కువ, మానసికంగా కుంగిపోయా.. సంజు భావోద్వేగ వ్యాఖ్యలు!

ఈ టెండర్లకు సీఓటీ (COT) అనుమతి కూడా అవసరం లేకుండా, డిపార్ట్‌మెంట్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 34 టెండర్ ప్యాకేజీలలో ఇప్పటికే 24 టెండర్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కుతో 20 నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు టెండర్లు వేయించారని కూడా ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజల డబ్బును కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Exit mobile version