Governor Abdul Nazeer: కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు. పవన్ కల్యా్ణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచించారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
పరామర్శ అనంతరం గవర్నర్, పవన్ కల్యాణ్ నివాసంలోని లైబ్రరీని కూడా సందర్శించారు. అక్కడ రచయితలు, పరిశోధకులు, విశ్లేషకులు, ప్రజా విధాన రూపకర్తలు రచించిన పలు విలువైన పుస్తకాలను పరిశీలించారు. పుస్తకాలలోని అంశాలు, సమకాలీన సామాజిక, పరిపాలనా, ప్రజా విధానాలపై పవన్ కల్యాణ్తో గవర్నర్ ఆసక్తికరంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ అభ్యర్థన మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఒక పుస్తకంపై తన ఆటోగ్రాఫ్ కూడా చేశారు. ఈ ఆత్మీయ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
తన ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చి పరామర్శించిన గవర్నర్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ చూపిన ఆప్యాయత, శుభాకాంక్షలు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు పలు సమకాలీన అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

