ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హాజరు నమోదు విషయంలో నెట్వర్క్ సమస్యలు, మొబైల్ యాప్ పనితీరు వల్ల కూలీలు నష్టపోకుండా నిబంధనలను సులువు చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల కారణంగా ఉపాధి పనికి వెళ్లే కూలీలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. చాలాచోట్ల సిగ్నల్ లేకపోవడం వల్ల కూలీల హాజరు నమోదు కావడం లేదు. ఇకపై ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ (NMMS) యాప్లో ఆఫ్లైన్ మోడ్లో హాజరు తీసుకోవచ్చు. పని ప్రదేశంలో ఫొటోలు, వివరాలు రికార్డ్ చేసి, నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి వచ్చాక రెండు రోజుల్లోపు (T+2) వాటిని అప్లోడ్ చేసే అవకాశం కల్పించారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి నెట్ వర్క్ సమస్య అనేదే ఉండదు.
దీని ద్వారా.. ఫీల్డ్ అసిస్టెంట్లు లేదా మేట్ల మొబైల్ ఫోన్లు పనిచేయకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్ అనుమతితో మరో ఫోన్ ద్వారా ‘జన్-మన్ రేగా’ యాప్ను ఉపయోగించి హాజరు వేయవచ్చు. కేవలం ఫోన్ పాడైందనే కారణంతో కూలీల పని దినాలు వృధా కాకుండా ఈ నిబంధన ఉపయోగపడుతుంది.
Also Read: PCB: పాకిస్థాన్కు అతి పిన్న వయస్కుడైన టెస్ట్ కోచ్.. 2017 చాంపియన్స్ ట్రోఫీ హీరో!
ఇప్పటివరకు హాజరు నమోదు సమయంలో ‘ఫేస్ ఆథెంటికేషన్’ కోసం కను రెప్పలను పైకి కిందకు కదిలించడం అనేది తప్పనిసరిగా ఉండేది. దీనివల్ల దృష్టి లోపం ఉన్న కూలీల హాజరు నమోదు కాక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు డిజబిలిటీ సర్టిఫికెట్ ఉన్న అంధులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు సాధారణ ఫొటోతోనే హాజరు నమోదు చేసుకోవచ్చు.
టెక్నికల్ కారణాలతో ఈ-కేవైసీ పూర్తికాని అర్హులైన కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారుల ధృవీకరణ ఉంటే ఫేస్ ఆథెంటికేషన్ లేకుండానే వారిని పనిలోకి తీసుకోవచ్చు. అయితే, పెండింగ్లో ఉన్న హాజరు వివరాలను 15 రోజుల్లోపు పరిష్కరించాలని.. లేదంటే ఆ డేటా శాశ్వతంగా తొలగిపోతుందని అధికారులు హెచ్చరించారు. ఈ మార్పు వల్ల లక్షలాది మంది గ్రామీణ కూలీలకు ఆర్థిక భద్రత చేకూరనుంది.