ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు అడవుల్లో ఉండే ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి 84 మంది పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. పర్యాటకులు తిరిగి వస్తుండగా ఒక్కసారిగా దారిలో ఉన్న వాగు పొంగింది. దీంతో వాగు దాటలేక అడవిలోనే ఉండిపోయారు పర్యాటకులు. వారిని కాపాడేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారి చంద్రమౌళిని వివరణ అడుగగా.. నిజమే అని ధృవీకిరించారు. మరోవైపు వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు NDRF బృందం కూడా సహాయక చర్యలు చేపట్టినట్టు సమాచారం. సందర్శనకు వచ్చిన వారిలో వరంగల్, హైదరాబాద్ కు చెందిన పర్యటకులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు వచ్చిన వాహనాలను వీరభద్రవరం గ్రామపంచాయతీ ముందుగా నిలిపి వెళ్లారు.
DGP Rajendranath Reddy: ఆ జిల్లాల్లో నేరాలు గణనీయంగా తగ్గాయి-డీజీపీ
ముత్యంధార జలపాతం వద్ద పర్యాటకులు చిక్కుకున్న ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. వరద ధాటికి అడవిలో చిక్కుకున్న పర్యటకులను గ్రామానికి చేర్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టమని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. పోలీసులు, రెస్క్యూ టీమ్ లు సంఘటన స్థలానికి చేరుకుని.. పర్యటకులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఎప్పటికప్పుడు ఘటనపై సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని పర్యటకులు సురక్షితంగానే ఉన్నారని.. ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షణ చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు.