దేశ రాజధాని ఢిల్లీలో భారీ బందోబస్తు మధ్య ఇద్దరు గ్యాంగ్స్టర్లు వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. హర్యానాకు చెందిన సందీప్, రాజస్థాన్కు చెందిన అనురాధా చౌదరి.. ఇద్దరూ గ్యాంగ్స్టర్లు.. వీరిపై అనేక కేసులున్నాయి. ప్రస్తుతం సందీప్ తీహాడ్ జైల్లో ఉండగా.. అనురాధా బెయిల్పై ఉంది. అయితే పెళ్లి కోసం సందీప్కు న్యాయస్థానం ఆరుగంటలు పెరోల్ ఇచ్చింది. దీంతో మంగళవారం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఓ హాల్లో అనురాధా మెడలో మూడు ముళ్లు వేయడంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ఓ గ్యాంగ్స్టర్ ఫ్రెండ్ ద్వారా సందీప్కు అనురాధా పరిచయం ఏర్పడింది. అలా నాలుగేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. మార్చి 12న పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సందీప్కు కోర్టు 6 గంటలు పెరోల్ ఇచ్చింది. పెళ్లి కోసం ద్వారకలోని ఓ ఫంక్షన్ హాల్ను బుక్ చేసుకున్నారు. సందీప్ తరపు న్యాయవాది రూ.51 వేలకు ఈ హాల్ను బుక్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్యాంగ్స్టర్లు తప్పించుకునే ప్రమాదం ఉందన్న వార్తల నేపథ్యంలో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్ల ఏర్పాటుతో పాటు సాయుధ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించింది.
సందీప్పై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి పదికి పైగా కేసులున్నాయి. ఒకప్పుడు సందీప్ తలపై రూ.7 లక్షల రివార్డుతో వాంటెడ్ క్రిమినల్ కేసులున్నాయి. ఇక గ్యాంగ్స్టర్ ఆనంద్పాల్ సింగ్ దగ్గర పనిచేసిన అనురాధా చౌదరీపై కూడా అనేక కేసులున్నాయి. ఈమెకు ‘రివాల్వర్ రాణి’ పేరు కూడా కలదు. మొత్తానికి ఇద్దరు గ్యాంగ్స్టర్లు పెళ్లితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుందానే మ్యారేజ్ జరిగింది.