NTV Telugu Site icon

Venkaiah Naidu: నేటి యువత సిద్ధాంతపర రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి..

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీని ఆయన స్వగృహంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. ఆంధ్ర ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో యలమంచిలి శివాజీతో కలిసి పని చేశానని ఆయన తెలిపారు. సిద్ధాంతపర రాజకీయలు చేయకుండా కుల రాజకీయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని.. రాజకీయాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. శాసనసభకి రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని.. తాను రాజకీయాల్లో ఉన్నపుడు ప్రజలే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని ఆయన వెల్లడించారు. తనకు 500 రూపాయలు ఇచ్చి ఎన్నికల ఖర్చుకు వినియోగించండి అని ప్రజలే డబ్బులు ఇచ్చే వాళ్లని వెంకయ్య తెలిపారు. సిద్ధాంతపర రాజకీయాలు ఇప్పుడు ఉన్న సమాజంలో కరువు అయ్యాయన్నారు.

Read Also: Bulldozer Action: బహ్రైచ్ నిందితులపై బుల్డోజర్ యాక్షన్.. యోగి సర్కార్‌కి సుప్రీంకోర్టు వార్నింగ్..

నేటి యువత సిద్ధాంతపర రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. శాసనసభలో జరిగే విషయాలపై గ్రామాల్లో చర్చలు జరగడం లేదన్నారు. సోషల్ మీడియాలో కొంత మంచి కొంత చెడు జరుగుతుందని.. సమాచారాన్ని ఆయుధంగా వాడడం లేదన్నారు. ప్రసార సాధనాలకు, పత్రికలకు స్వేచ్ఛ నిజాయితీ ఉండాలని అన్నారు. అందుకే నేటి యువతకు అవగాహన చేయడానికే విద్యార్థులతో కాలేజీలకు వెళ్లి మాట్లాడుతున్నానని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు, శాసనసభలో మాట్లాడే భాషలో మార్పు రావాలన్నారు. బూతులు తిట్టే రాజకీయ నాయకులకు బూత్‌లోనే సమాధానం చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.