NTV Telugu Site icon

Pendem Dorababu: జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్‌ కల్యాణ్‌..

Pendem Dorababu

Pendem Dorababu

Pendem Dorababu: కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అప్పటి వరకు వైసీపీలో ఉన్న కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఇలా.. చాలా మంది ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. కూటమి పార్టీలో చేరుతున్నారు.. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలో పలువురు నేతలు చేరిపోయారు.. ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జనసేనలో చేరిపోయారు.. గతంలోనే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. ఈ నెల 3వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా పెండెం దొరబాబు చేరికకు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ఈ రోజు అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు పెండెం దొరబాబు.. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు..

Read Also: YouTuber: గర్ల్‌ఫ్రెండ్‌ని, ఆమె తల్లిని ఒకేసారి గర్భవతులుగా చేసిన యూట్యూబర్.. నిజం ఏంటంటే..

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్ధానిక నేతలు పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.. మరికొందరు నేతలు.. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. కాగా, గత ఏడాది ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని.. అందుకే వైసీపీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని పేర్కొన్నారు. ఇక, తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని పేర్కొన్నారు.. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌కు కలిసి జనసేనలో చేరికకు లైన్‌ క్లియర్ చేసుకున్న ఆయన.. తన అనుచరులతో కలిసి ఈ రోజు జనసేన గూటికి చేరారు.. ఇక, 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు దొరబాబు.. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్‌ బరిలోకి దిగడంతో.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు వైఎస్‌ జగన్‌ టికెట్‌ నిరాకరించారు. పవన్‌పై పోటీగా వంగా గీతను బరిలోకి దింపారు.. కానీ, ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టిన విషయం విదితమే. తాజా పరిణామాలతో పిఠాపురంలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉంటుందో వేచిచూడాలి.