Vidyasagar Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో ‘2024 ప్రజా తీర్పు-సందేశం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్మారక ఉపన్యాసం చేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అనుకున్న స్థానాలు రాలేదు.. ఎన్నికల ఫలితాలపై సూక్ష్మ స్థాయి నుంచి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం మంచితనం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.. బీజేపీ అన్యాయం చేస్తుందని అపోహలు సృష్టిస్తున్నారు.. కానీ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు వచ్చిన సీట్లు కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు విద్యాసాగర్రావు..
ఇక, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. మనకు వున్నది డబుల్ ఇంజన్ సర్కారు కాదు.. పవన్ కల్యాణ్తో కలిసి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుందంటూ చమత్కరించారు. ఆంధ్రుల సహకారంతో మోడీ మరోసారి ప్రధాని కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి.. చలపతిరావు ఆశలు నెరవేరాలన్నారు జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.