ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ ఐదుగురు యువకులు పల్సర్ బైక్ పై నిర్లక్ష్యంగా ప్రయాణించారు. అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైఫాబాద్ సిఐ ఎ. సీతయ్య తెలిపారు.
Also Read:US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
గత నెల మార్చి 29 అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న పల్సర్ బైక్పై ఐదుగురు యువకులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో వడ్డీ అర్జున్ (22) బైక్ నడుపుతున్నట్లు గుర్తించారు. అతనితో పాటు అరుపు రోహిత్ (19), చింతకుంట అంజ కుమార్ (19), సిద్ధం కౌశిక్ (18), వల్లపు మురళి (18) ఒకే బైక్పై ప్రయాణించినట్లు తేలింది.
Also Read:US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
హెల్మెట్ ధరించకుండా, బైక్ సామర్థ్యానికి మించి ఐదుగురు ప్రయాణించడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై BNS సెక్షన్ 281, 125తో పాటు మోటార్ వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐ ఎ. సీతయ్య వెల్లడించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువత సరదా కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.
