Elephants Died: జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని ముసబాని అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. 33000 హై ఓల్టేజీ విద్యుత్ వైరు తగిలి ఐదు ఏనుగులు మృతి చెందాయి. చనిపోయిన ఏనుగుల్లో రెండు పిల్లలు, మూడు పెద్ద ఏనుగులు ఉన్నాయి. ముసబాని అటవీ ప్రాంతంపైన పొటాస్ అడవి మధ్యలో తవ్విన గొయ్యి దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఏనుగుల గుంపు కిందికి వెళుతుండగా ఒక్కసారిగా పైన వెళ్తున్న 33 వేల వోల్టుల వైరు తగిలింది. 5 ఏనుగులు మరణించిన హైటెన్షన్ వైర్ HCL గనులకు వెళుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్థరాత్రి నుంచి దాదాపు డజను ఏనుగుల గుంపు ఆ ప్రాంతమంతా సంచరిస్తోంది. సోమవారం అర్థరాత్రి హైటెన్షన్ వైర్లు తగిలి ఏనుగులు చనిపోయి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also:Andela Sriramulu Yadav: అందెల శ్రీరాములుకు మద్దతు తెలిపిన నిరుద్యోగ జేఏసీ.. మంత్రి సబితపై ఫైర్
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని అటకెక్కిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవి నుంచి కలపను తెస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులను తరిమికొడుతుండగా.. చనిపోయిన ఏనుగులను గ్రామ ప్రజలు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముసబాని అటవీ ప్రాంతంలోని ఉపరబంధ అటవీ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రదేశంలో కేవలం 11 అడుగుల ఎత్తులో 33000 ఓల్టేజీ హైటెన్షన్ వైర్ వెళుతోంది. మరోవైపు రెండ్రోజుల క్రితం అటవీశాఖ అధికారులు అడవిలో కందకం తవ్వారు. లోపల నుంచి తీసిన మట్టిని కూడా అక్కడే ఉంచారు. ఏనుగుల గుంపు గుట్ట లాంటి మట్టిదిబ్బను దాటుతుండగా, హైటెన్షన్ వైరు తగిలి ఐదు ఏనుగులు చనిపోయాయి. చనిపోయిన ఐదు ఏనుగుల్లో రెండు ఆడ ఏనుగులు కూడా ఉన్నాయి.
Read Also:Harish Rao: చివరకు రామక్క పాటని కూడా కాంగ్రెస్, బీజేపీ కాపీ కొట్టింది: హరీష్ రావు
దాదాపు వారం రోజులుగా ముసబాని ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా పంటలను కాపాడుకునేందుకు ఏనుగుల గుంపును తరిమి కొట్టడంతో గ్రామ ప్రజలు అడవి వైపు పరుగులు తీశారు. ఈ సమయంలో అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా హైటెన్షన్ వైర్ తగిలి ఏనుగులు అకాల మృత్యువాత పడ్డాయని వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ ఆదేశించారు.