Bihar Politics: బీహార్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి సర్కార్ పడిపోయింది. గత వారం రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం ఉదయం నితీష్ రాజీనామా చేశారు. గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సాయంత్రం 7 గంటలకు మరోసారి బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి సీఎంగా నితీష్కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇదిలా ఉంటే నితీష్కుమార్ వైఖరిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. తరచూ రాజకీయ భాగస్వాములను మార్చడం నితీశ్ కుమార్కు అలవాటేనని.. రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ఘాటుగా వ్యాఖ్యానించింది. బీహార్ ప్రజలు నితీష్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరని కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను చూసి ప్రధాని మోడీ, బీజేపీ భయపడుతుందన్నారు. దీన్ని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఈ గందరగోళానికి తెరలేపిందని ఆరోపించారు.
Read Also: Minister Peddireddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్
నితీష్ రాజీనామా వ్యవహారం తమకు ముందే తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే తెలిపారు. ఈ విషయాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ముందుగానే తెలియజేశారని చెప్పుకొచ్చారు. కానీ ఇండియా కూటమి ఐక్యత దెబ్బ తింటుందన్న భావనతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. నీతీశ్ లాంటి ‘ఆయా రామ్.. గయా రామ్’ మనుషులు దేశంలో చాలా మంది ఉంటారని ఖర్గే ఎద్దేవా చేశారు.