Fine Rice Prices Surge in Godavari Districts: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సన్నబియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గత రెండున్నర నెలల్లో క్వింటాల్కు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ధరలు పెరగడంతో.. సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లోనే ఇప్పుడు బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడం, బియ్యం ఎగుమతులు పెరగడం, మార్కెట్లో నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని రైస్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. 52 సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం చేస్తున్నామని, కానీ కేవలం నెల రోజుల వ్యవధిలో క్వింటాల్కు రూ.1,000 వరకు ధరలు పెరగడం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు.
రైతుల వద్ద సరిపడా ధాన్యం లేకపోవడం, కొందరు మిల్లర్లు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాతో నిల్వలు ఉంచుకోవడం వల్ల మార్కెట్లో సరఫరా తగ్గిందని మిల్లర్ల సంఘం పేర్కొంటోంది. అందుకే సన్నబియ్యం ధరలు మరింత పెరుగుతున్నాయంటున్నారు. ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు బియ్యం విక్రయాలు ప్రారంభించినప్పటికీ.. పంట దిగుబడులు తగ్గిన పరిస్థితిలో దీర్ఘకాలికంగా సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సరిపడా పంట లేకపోతే మార్కెట్లో ధరలను నియంత్రించడం సవాలుగా మారుతుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అటు వినియోగదారులు బియ్యం ధరల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల బియ్యం ధరలు బస్తాకు రూ.200 నుంచి రూ.400 వరకు పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర భారం పడుతోంది. బియ్యం ఎగుమతులు పెరగడం, కరువు వస్తుందన్న అంచనాల పేరుతో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు బియ్యం ధరల పెరుగుదల మరో పెద్ద భారంగా మారింది.

