FBI Warns Smartphone Users: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా విదేశీ కంపెనీలు తయారు చేసిన కొన్ని మొబైల్ యాప్ల వల్ల వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ యాప్లు వినియోగదారుల సున్నితమైన సమాచారం.. లొకేషన్, కాంటాక్ట్స్, వ్యక్తిగత సందేశాలు వంటి డేటాను సేకరించే అవకాశముందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. అందువల్ల, ఏ యాప్నైనా డౌన్లోడ్ చేసే ముందు వినియోగదారులు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు.
Read Also: Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..
ఎఫ్బీఐ ప్రత్యేకంగా ఏ యాప్ల పేర్లు వెల్లడించకపోయినా, వినియోగదారుల భద్రత కోసం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ముఖ్యంగా యాప్ ఇన్స్టాల్ చేసే ముందు దాని అనుమతులు (permissions), డెవలపర్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. ఈ హెచ్చరికలు ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల వినియోగదారులందరికీ వర్తిస్తాయి. విదేశీ కంపెనీలు, ముఖ్యంగా చైనాకు చెందిన సంస్థలు అభివృద్ధి చేసిన యాప్లపై ఈ హెచ్చరిక ఎక్కువగా దృష్టి సారించింది. అక్కడి భద్రతా చట్టాల ప్రకారం, కంపెనీలు వినియోగదారుల డేటాను ప్రభుత్వంతో పంచుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాప్లైన టిక్టాక్, క్యాప్కట్, టెము, షీన్, లెమన్8 వంటి యాప్ల వినియోగంపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇక, అధికారిక యాప్ స్టోర్లకు బయట నుంచి యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం (సైడ్లోడింగ్) ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరింత ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. అయితే, ఐఫోన్ వినియోగదారులు కూడా పూర్తిగా సురక్షితంగా ఉన్నారని అనుకోవద్దని స్పష్టం చేశారు. విశ్వసనీయమైన ప్లాట్ఫారమ్లలో కూడా కొన్ని యాప్లు వినియోగదారుల డేటాను తెలియకుండా సేకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా, స్మార్ట్ఫోన్ వినియోగదారులు తమ వ్యక్తిగత డేటా రక్షణ కోసం అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. అనుమానాస్పద యాప్లను దూరంగా ఉంచడం, అవసరానికి మించిన అనుమతులు ఇవ్వకపోవడం ద్వారా తమ డేటాను కాపాడుకోవచ్చు.