మలయాళ చిత్ర పరిశ్రమలో సుమారు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసిన చిత్రం ‘ఆవేశం’. ఫహద్ ఫాజిల్ పోషించిన ‘రంగన్న’ పాత్రకు భాషాభేదం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్లో నటుడు పాల్గొన్న ఫహద్, ఈ ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ అందరినీ ఖుషీ చేశారు.
ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ‘ఆవేశం 2’ కచ్చితంగా ఉంటుందని, రంగన్న పాత్రను మళ్ళీ వెండితెరపై చూస్తారని స్పష్టం చేశారు. అయితే ఇది పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని, 2027 లేదా 2028లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దర్శకుడు జీతూ మాధవన్.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఫహద్-జీతూ కాంబోలో ‘ఆవేశం 2’ ప్రారంభం కానుంది. దీంతో పాటు మమ్ముట్టి, మోహన్లాల్ వంటి దిగ్గజాలతో కలిసి తాను ‘పేట్రియాట్’ అనే సినిమాలో విలన్గా నటిస్తున్నట్లు కూడా ఫహద్ వెల్లడించారు. రంగన్న మ్యానరిజమ్స్, ఆ వైట్ అండ్ వైట్ లుక్ మళ్ళీ రాబోతుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
