Rahul Gandhi: రాహుల్‌ అనర్హతపై స్పందించిన జర్మనీ.. ఏమందంటే?

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ వ్యవహారం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. రాహుల్‌ గాంధీ అనర్హత విషయంలో పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా ప్రకటించగా.. తాజాగా జర్మనీ స్పందించింది. పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో లోక్‌సభకు అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీ విషయంలో “ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు” వర్తిస్తాయని జర్మనీ ఈరోజు పేర్కొంది.

‘‘భారత్‌లో ప్రతిపక్ష రాజకీయ నాయకుడు రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష.. ఆ తీర్పు కారణంగా ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దవ్వడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం. అయితే ఈ తీర్పుపై ఆయన అప్పీల్‌ చేసుకునే స్థితిలోనే ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా.. ఏ ప్రాతిపదికన ఆయనపై అనర్హత పడింది అనేది స్పష్టమవుతుంది. ఈ కేసుకు న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ భావిస్తోంది’’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

ఈ వారం ప్రారంభంలో, రాహుల్ గాంధీ కేసును తాము చూస్తున్నామని, భావప్రకటనా స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు భాగస్వామ్య నిబద్ధతతో వారు భారత ప్రభుత్వంతో నిమగ్నమై ఉన్నారని అమెరికా తెలిపింది. ఏ ప్రజాస్వామ్యానికైనా చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాల్లాంటివని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. “ఏ ప్రజాస్వామ్యానికైనా చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాల్లాంటివి. భారతీయ కోర్టులలో గాంధీ (రాహుల్ గాంధీ) కేసును చూస్తున్నాము” అని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ అన్నారు.

Read Also: Meta Verified Blue Tick: భారత్‌లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా బ్లూ టిక్‌కు ఛార్జీలు.. నెలకు ఎంతంటే..?

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యపై క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తేదీ నుంచి లోక్‌సభ సభ్యునిగా (ఎంపీ) గత వారం అనర్హత వేటు పడింది. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2019లో కర్ణాటకలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ‘మోదీ ఇంటిపేరు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఏప్రిల్ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది” అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసును సూరత్ వెస్ట్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేశారు.