Election Commission: డూప్లికేట్ ఓట్లపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది. తప్పుడు సమాచారంతో ఓటర్ నమోదుకు ప్రయత్నించే దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం వారికి శిక్షలు ఉంటాయని వెల్లడించింది. ఇదే విషయాన్ని రాష్ర్టంలోని అన్ని రాజకీయపార్టీలకు సైతం తెలియచేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులందరికి ఆదేశాలు జారీ చేసింది.
వాటిలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
*పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17,18 ప్రకారం ఒక ఓటర్ ఒకచోట మాత్రమే ఎన్రోల్ అయి ఉండాలి. అలా కాకుండా ఒక చోటకు మించి వేరే చోట లేదా మరో ప్రాంతంలో ఓటర్గా నమోదు చేసుకోవడం జరిగితే సెక్షన్ 31 ( పీపుల్స్ యాక్ట్ ) ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కేసులు నమోదు చేస్తారు.
*ఫారమ్ 6 అనేది ఫస్ట్ టైమ్ మాత్రమే ఎన్రోల్ చేసుకునేవారు వినియోగించాలి. ఫారమ్ 6 కింద దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడా కూడా ఓటర్గా నమోదు అయి ఉండకూడదు. అలా కాకుండా ఎవరైనా ఓటు కలిగి ఉండి కూడా ఫారమ్ 6 కింద ఎన్రోల్ చేసుకుంటే సెక్షన్ 31 ప్రకారం శిక్షించడం జరుగుతుంది.
*ఫారం 8 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి తగు విధంగా విచారణ చేయాలని బూత్ లెవల్ ఆఫీసర్లకు ఖచ్చితంగా కొన్ని అంశాలకు విచారణ చేసి తీరాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వాటిలో సంబంధిత వ్యక్తి ఓటర్ ఐడీని ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో చెక్ చేయాలి. అలా ఎక్కడైనా వారి పేరు వెబ్ సైట్లో ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని ఆ దరఖాస్తుదారుని అప్లికేషన్పై కామెంట్గా రాయాలి. ఫీల్డ్ వెరిఫికేషన్లో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి.
*వీటికి సంబంధించి బూత్ లెవల్ ఏజెంట్ల నుంచి గాని ఇతరుల నుంచి సందేహాలు, అభ్యంతరాలు ఉంటే బూత్ లెవల్ ఆఫీసర్లు నమోదు చేసుకోవాలి.
*వీటన్నింటిని అంటే డాక్యుమెంట్స్, ఫీల్డ్ వెరిఫికేషన్, బీఎల్వోలు, బీఎల్ఏల రిమార్క్స్ ను పొందుపరిచిన అనంతరమే ఈ ఆర్ ఓ లు ఆ దరఖాస్తులకు సంబంధించి తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
*ఏ దరఖాస్తుదారుడైనా తప్పుడు ధృవీకరణ, తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే వారిపై ఈఆర్ఓ కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా తగుచర్యలు తీసుకుంటారు.