NTV Telugu Site icon

TDP vs YSRCP: నెట్టింట వైసీపీ-టీడీపీల మధ్య ‘డంకీ’ పోస్టర్‌ వార్

Tdp Vs Ysrcp

Tdp Vs Ysrcp

TDP vs YSRCP: ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. టీడీపీ, జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య నెట్టింట పోస్టర్‌ వార్ మొదలైంది. ‘డంకీ’ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను వాడుకుని ఇరు పార్టీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ పోస్టర్‌లను ట్విట్టర్‌లోని తమ అధికారిక హ్యాండిళ్లలో పోస్ట్‌ చేశాయి.

టీడీపీ ముందుగా..
టీడీపీ ముందుగా డంకీ పోస్టర్‌ను వైసీపీ నేతల ముఖాలతో మార్ఫింగ్‌ చేసి ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. దీని క్యాప్షన్‌గా “2024 ఎన్నికల ఫలితాలకు ముందే సైకో వైకాపా బ్యాచ్ అంతా విదేశాలకు పారిపోవడానికి లగేజీ సర్దుకుంటున్నారు.” అని రాసుకొచ్చింది. ఈ పోస్టర్‌లో JUMPI-AFTER 2024 Elections అని టైటిల్‌ను యాడ్ చేసింది టీడీపీ. ఈ పోస్టర్‌పై సీఎం జగన్‌, మంత్రి రోజా, మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ముఖాలను చేర్చింది. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ఈవిధంగా..
దీనికి ప్రతిస్పందించిన వైసీపీ కూడా టీడీపీ నేతల ముఖాలతో డంకీ పోస్టర్‌ను ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. దీని క్యాప్షన్‌గా.. “పేదలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పచ్చ హమాస్ బ్యాచ్ మన రాష్ట్రం నుంచి తరలిపోయే రోజు త్వరలోనే రానుంది.” అని రాసుకొచ్చింది. ఈ పోస్టర్‌లో “JUMPING JAPANG” అని టైటిల్‌ను యాడ్ చేసింది వైసీపీ. ఈ పోస్టర్‌పై నారా లోకేష్, రామోజీ రావు, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌, పవన్‌ కళ్యాణ్‌ ముఖాలను చేర్చింది. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వర్సస్ టీడీపీ, జనసేన మధ్య పొలిటికల్ వార్‌ కొనసాగుతోంది.