NTV Telugu Site icon

Andhra Pradesh Crime: ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్‌.. చనిపోయినట్లు నాటకం.. చివరి ఏమైందంటే..?

Crime News

Crime News

Andhra Pradesh Crime: చనిపోయాడు అనుకున్న ఓ వ్యక్తి బతికే ఉన్నానని.. అప్పులు పాలైన ఓ రైతు సినిమా ఫక్కీలో భీమా సొమ్ము కోసం ఆడిన డ్రామా కేసు వెలుగు చూసింది.. ఈ కేసును చేధించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు చూసి షాక్‌ తిన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ సినిమా తీసేంత స్థాయిలో భారీ స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయి నట్లు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు..

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్‌ పూసయ్య అనే వ్యక్తి.. వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి. వివిధ అవసరాల కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశాడు.. అవి తీర్చలేని పరిస్థితి వచ్చింది.. దీంతో, వాటి నుంచి బయటపడేందుకు తానే చనిపోయినట్టు చిత్రీకరించి.. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట రూ.40లక్షల బీమా సొమ్ము వస్తుందని ఆశించారు.. దాని కోసం ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్లాన్‌ చేశాడు.. అతడి స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు. ఇక, ఆ డెడ్‌బాడీ కోసం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో డీల్‌ చేసుకున్నాడు..

అయితే, పాత బొమ్మూరులో ఈ నెల 23వ తేదీన ఓ వ్యక్తి చనిపోయాడు.. మరుసటిరోజు బంధువులు స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయాన్ని విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు.. పూడ్చిపెట్టిన ఆ మృతదేహాన్ని 25వ తేదీన దొంగిలించారు. వీరయ్య చెప్పిన ప్లాన్‌ ప్రకారం.. ఆ మృతదేహాన్ని వీరంపాలెం తీసుకెళ్లి పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఆ ప్లేస్‌లో పూసయ్య చెప్పులతో పాటు సెల్ఫీని అక్కడే ఉద్దేశ్యపూర్వకంగా వదిలివెళ్లారు. ఇక, ఆధారాలనుబట్టి మృతదేహం పూసయ్యదే నని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త మరణించారని భావించి ఆయన భార్య తట్టుకోలేక తానూ చనిపోతానంటూ కన్నీరుమున్నీరైంది.. ఇక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు ఆ ఇద్దరు యువకులు.. అజ్ఞాతంలో ఉన్న పూసయ్యకు వివరిస్తూ వచ్చారు..

ఇక, భార్య బాధను చూడలేక ఆమెకు.. ఎలాగైనా అసలు విషయాన్ని చెప్పాలని భావించి పూసయ్య.. మరో కొత్త స్కెచ్‌ వేశాడు.. గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని, దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లారని.. ఆ తర్వాత తుప్పల్లో పడేసి వెళ్లారని చెప్పుకొచ్చాడు.. కానీ, అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో అప్పడికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూసయ్య మళ్లీ రావడంతో.. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. పూసయ్యతో పాటు అతడికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.