Ali Khamenei: ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాదనను బలపరుస్తూ, సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన పోస్ట్లో ట్రంప్.. ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరిగా అభివర్ణించారు. ఆయన మరణం ఇరాన్ ప్రజలకే కాకుండా, ఆయన హయాంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులందరికీ లభించిన న్యాయమని వెల్లడించారు. అమెరికా నిఘా సంస్థలు, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని, ఇజ్రాయెల్తో సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని ట్రంప్ తెలిపారు.
“ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. తరతరాలుగా మీకు లభించని ఏకైక అవకాశం ఇది. మీ ప్రభుత్వాన్ని మీరు చేతుల్లోకి తీసుకోండి” అని ట్రంప్ ఇరానియన్లకు పిలుపునిచ్చారు. “ఇరాన్ సైన్యం – పోలీసులు దేశభక్తులతో కలిసి శాంతియుతంగా పని చేస్తారని, దేశ వైభవాన్ని పునరుద్ధరిస్తారని మేము ఆశిస్తున్నాము” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ సైన్యం (IRGC), పోలీస్, ఇతర భద్రతా దళాల్లోని చాలా మంది ఇకపై పోరాడటానికి సిద్ధంగా లేరని, తమకు ఉపశమనం కావాలని కోరుతున్నట్లు సమాచారం ఉందని ట్రంప్ ఈ పోస్ట్లో వెల్లడించారు. శాంతి స్థాపన కోసం అవసరమైనంత కాలం ఇరాన్ లోని సైనిక స్థావరాలపై కచ్చితమైన బాంబు దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా అమెరికా స్పష్టం చేసింది. 1979 నుంచి ఇరాన్ అత్యున్నత నిర్ణేతగా ఉన్న ఖమేనీ మరణంతో ఆ దేశంలో నాయకత్వ శూన్యం ఏర్పడిందని చెప్పారు. ఆయనకు సరైన వారసుడు లేకపోవడంతో ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమేనీ మరణంపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
READ ALSO: Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..
