Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!

Cm Chandrababu

Cm Chandrababu

తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద పునరుద్ధరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. గేట్ల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో ధవళేశ్వరం బ్యారేజీలో 58 కొత్త గేట్లను అమర్చిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇప్పుడు మిగిలిన 117 గేట్లను అత్యాధునిక సాంకేతికతతో మార్చే పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.

బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటి పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం సముద్రంలోకి 27 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోందని అధికారులు వివరించగా.. కాల్వల ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 14,700 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాల్వల చివరి ఆయకట్టు భూముల వరకు నీరు సక్రమంగా చేరేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

అనంతరం గోదావరి డెల్టా అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. గోదావరి, కోనసీమ ప్రాంతాలు ప్రకృతి అందాలకు నిలయమని, ఆ ప్రత్యేకతను భవిష్యత్తులో కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కోనసీమకు పోటీగా రాయలసీమ కూడా వ్యవసాయంలో ముందుకు వస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించగా.. రాయలసీమలో ప్రస్తుతం నాణ్యమైన ఉద్యాన పంటలు విస్తృతంగా పండుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు వరద నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. అలాగే గోదావరి డెల్టాలోని లక్షలాది ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.