ఈనెల 8 వతేదీన రాష్ట్రంలో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈనెల 8 న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై నేడు వరంగల్ పోలీస్ కమీషనర్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సమీక్షించారు. అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజి షా నవాజ్ కాసీం, సంప్రీత్ సింగ్ లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, ప్రధాని పర్యటన లో ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా రెవిన్యూ, రైల్వే, రోడ్లు భవనాలు తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని, అయితే, సామాన్య ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ప్రధాని పర్యటన రోజు ఒక వేళ భారీ వర్షమంటే తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.
Also Read :Kishan Reddy : కాంగ్రెస్కు 10 ఎకరాలు.. బీఆర్ఎస్కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు
బహిరంగ సభకు హాజరయే వారు ఏ మార్గంలో చేరుకోవాలని, ఎక్కడ పార్కింగ్ సౌకర్యం కల్పించామన్న వివరాలను ముందస్తుగానే తెలియచేయాలని చెప్పారు. వరంగల్ లో ప్రధాని దిగే హెలిపాడ్ తోపాటు వేదిక వద్దకు చేరుకునే మార్గాల్లో ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదికవద్ద పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్లూ బుక్ లోని నియమ నిబంధనలను అనుసరించి తగు బందోబస్తు ఏర్పాటు చేయాలను తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాధ్ మాట్లాడుతూ, 8 వ తేదీన ఉదయం ప్రధాని కార్యక్రమాలున్న మామునూర్ , భద్రకాళి ఆలయం, ఆర్ట్స్ కళాశాల లలో సీనియర్ పోలీస్ అధికారులను ఇంచార్జిలుగా నియమించి పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాట్లను చేశామని వెల్లడించారు. ఇప్పటికే హన్మకొండ పౌలులకు ట్రాఫిక్, సెక్యూరిటీ ఏర్పాట్లపై అడ్వైజరీ లను జారీ చేశామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ నుండి సీనియర్
పోలీస్ అధికారులు పాల్గొన్నారు.