NTV Telugu Site icon

Karthika Masam Last Monday: కార్తిక మాసం ఆఖరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Karthika Masam

Karthika Masam

Karthika Masam Last Monday: కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది.. గోదావరి నది తీరం భక్తులతో కిటకిటలాడుతుంది. రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల కార్తిక స్నానాలతో పులకరిస్తుంది. రాజమండ్రి పుష్కర ఘాట్ లో వేలాదిగా భక్తులు విచ్చేరసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు శివనామ స్మరణతో స్నానఘట్టాలు మారుమోగుతున్నాయి.. గోదావరి నదిలో స్నానాలు ఆచరించి మహిళలు కార్తిక దీపాలు వదులుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని శివాలయాలు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. పరమేశ్వరుడిని దర్శించుకుని. భక్తులు ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పరమేశ్వరుడి దర్శనం కోసం శివాలయాల వద్ద భక్తులు బారులు తీరారు. కార్తీక మాసంలో గోదావరిలో కార్తీక దీపాలు వెలిగించడం వలన పాపం పరిహారం లభిస్తుందని భక్తుల విశ్వాసం..

అయితే, శివుడిని హృదయపూర్వకంగా స్మరించినట్లయితే, జీవితంలోని అన్ని కష్టాలు మరియు కష్టాలు తొలగిపోతాయని పురుణాలు చెబుతున్నాయి.. హిందూ మతంలో, శివుడు చాలా దయ మరియు దయగలవాడు. శివుడు ఒక్క కుండ నీటితో కూడా సంతోషిస్తాడని చెబుతారు. ఇక, ఈ రోజు శివుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైన రోజు. కార్తికమాసం శివకేశవులకు ఎంతో పవిత్రమైన మాసం. ఈ రోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివ ఆలయాలను సందర్శించి స్వామి వారిని దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. మరోవైపు.. హిందూ మతంలో సోమవారాన్ని చాలా పవిత్రంగా మరియు ప్రత్యేకంగా భావిస్తారు. కార్తిక మాసం చివరి సోమవారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున, శివుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం మరియు కొన్ని జ్యోతిష్య చర్యలు చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని భక్తుల విశ్వాసం..

కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో పంచరామ క్షేత్రంలో ఒకటైన చంద్రుడు ప్రతిష్ట చేసిన భీమవరం సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము 2 గంటల నుండి బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయం మార్మోగుతోంది.. భక్తులు 365 ఒత్తులు వెలిగించి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తిక పౌర్ణమి దీపాలను మహిళలు సోమగుండం చెరువులో వదులుతున్నారు. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడంతో ప్రతి పౌర్ణమికి శివలింగం శ్వేతవర్ణంలోనూ, ప్రతి అమావాస్యకి శివలింగం గోధుమ రంగులోను మారుతూ ఉంటుంది. పౌర్ణమి తిధి ఉండడంతో స్వామి వారి శివలింగం శ్వేత వర్ణంలో కనిపించడంతో భక్తులు హర హర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.. ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అర్చకులు, దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు భక్తులు.

శ్రీశైలంలో కార్తిక మాస చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణిలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాస చివరి సోమవారం కావడంతో ముక్కంటి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.. పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు.. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనం కలిపిస్తున్నారు అధికారులు.. క్యూలో పెద్ద సంఖ్యలో భక్తులు వేచిఉండడంతో.. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. మరోవైపు.. విజయవాడలో కృష్ణా నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.. దుర్గాఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ లలో భక్తుల రద్దీ పెరిగింది.. నేడు సప్త నదుల సంగమేశ్వర ఆలయంలో కళ్యాణ మహోత్సవం, రుద్రహోమం, మృత్యుంజయ హోం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నారు. మహానంది క్షేత్రంలో స్వామివారికి మహా రుద్రాభిషేకం, సాయంత్రం లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పుణ్యగిరి శ్రీ ఉమాకోటిలింగేశ్వర ఆలయం, సన్యాషేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.