Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి నాలుగు గ్రేడులుగా పంచాయతీలను వర్గీకరించడం శుభ పరిణామమని ఏపీ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ తెలిపింది. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్నారు. నాలుగు గ్రేడుల పంచాయతీల విధానం కచ్చితంగా గ్రామీణ ప్రజలకు మేలు చేస్తుంది. రూర్బన్ పంచాయతీలు గుర్తించినవాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తాము అన్నారు.
ఇక, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు పవన్ కల్యాణ్… స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా సంస్కరణలు తీసుకువచ్చాము అని తెలిపారు. వీటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో సిబ్బంది పాత్ర కీలకం అన్నారు పవన్. పంచాయతీలను నాలుగు గ్రేడులుగా వర్గీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు కలుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పన చేపట్టడంతో అందరూ సంతోషంగా ఉన్నామని, మరింత ఉత్తేజంతో విధులు చేపడతామని వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసిన పలు అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి… వాటిపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.