NTV Telugu Site icon

Pawan Kalyan: ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించిన పవన్.. మత్స్యకారుల ఇబ్బందులపై ఆరా

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది.. అందులో భాగంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు పవన్.. తుఫాన్‌, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సముద్రం కోతకు గురవుతున్న సమయంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.. గతంలో జరిగిన ఘటనలను ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా.. అవి తిలకించిన పవన్‌.. వాటిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.. సముద్ర కెరటాలు దాటికి మాయపట్నం నుంచి కొత్తపట్నం వరకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయని పరిశీలించారు.. చెన్నై నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ పోస్టల్ రీసెర్చ్ బృందంతో తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.. అమీనాబాద్ ను పరిశీలించారు.. తీర ప్రాంత ప్రజల రక్షణకు తీసుకోవలసిన చర్యలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సమీక్షించారు డిప్యూటీ సీఎం.. వాకతిప్ప గ్రామంలో సూరప్ప త్రాగునీటి చెరువును పరిశీలించి, మంచినీటి లైన్ ఏ విధంగా వెళ్తుంది.. వాటర్ ఏవిధంగా ప్యూరిఫికేషన్ జరుగుతుంది అడిగి తెలుసుకున్నారు..

Read Also: Deputy CM Pawan Kalyan: బాధితుల ప్లకార్డు చూసి కాన్వాయ్‌ ఆపిన పవన్‌.. న్యాయం చేస్తానని హామీ

ఇక, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు పవన్‌.. నా బార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు.కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక, కొండేవరంలో గతవారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు పవన్ కాన్వాయ్ వెళ్తుంటే ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు.. వారిని చూసి ఆగిన డిప్యూటీ సీఎం సమస్య అడిగి తెలుసుకుని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో కృతజ్ఞతా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.