Delhi-NCR Heavy Rain: ఉత్తర భారత్లో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. నోయిడా, ఘాజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్ ప్రాంతాలను ముంచెత్తిన వానల వల్ల జనజీవనం స్తంభించడమే కాకుండా రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 15 విమానాల రూట్లను అధికారులు దారి మళ్లించారు. ఇందులో 12 విమానాలను జైపూర్, రెండింటిని ఛండీగఢ్, మరో విమానాన్ని లక్నోకు తరలించారు. ఏవియేషన్ డేటా ప్రకారం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకల్లో సగటున 32 నిమిషాల జాప్యం జరుగుతుండగా, సుమారు 262 విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. వర్షాల ధాటికి దేశ రాజధాని పరిధిలో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.
గుర్గావ్లోని సోహ్రా రోడ్ ఇస్లాంపూర్ వద్ద సర్వీస్ లేన్లో దాదాపు రెండు అడుగుల మేర నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీలోని సంగమ్ విహార్, ఎంబీ రోడ్ పరిసరాల్లో వాహనాలు గంటల తరబడి చిక్కుకుపోవడంతో ఆఫీసులకు, ఎయిర్పోర్ట్కు అలాగే సాకేత్ కోర్టుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘాజియాబాద్లోని NH-9 ఇండస్ట్రియల్ ఏరియా అండర్పాస్ వద్ద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రయాణాలను ఆపి రోడ్డు పక్కనే వేచి చూడాల్సి వచ్చింది. అయితే, ఉక్కపోతతో అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. ఇండియా గేట్, నోయిడా సెక్షన్లలో కురిసిన వర్షాలకు సంబంధించిన దృశ్యాలు ఆహ్లాదకరంగా మారాయి. రాబోయే రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ వ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఫరీదాబాద్, గుర్గావ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

