Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!

Delhi

Delhi

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఉద్యోగభవన్ సమీపంలోని కార్మికులు నివసించే స్లమ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ ప్యానెల్‌లో మంటలు మొదలై, అక్కడి నుంచి సమీపంలోని తాత్కాలిక గుడిసెలకు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమై ఘటనాస్థలికి 20 ఫైరింజన్లను తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఉదయం 5:10 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా చుట్టుముట్టగా.. 5:30 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విద్యుత్ ప్యానెల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అవి సమీపంలోని కార్మికుల నివాస గుడిసెలకు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

×
×
Ad

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితమే ఢిల్లీలోని తకియా కాలే ఖాన్ ప్రాంతంలోని బాల్మీకి బస్తీలో కూడా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ వెనుక ఉన్న స్లమ్ క్లస్టర్‌లో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మొదట 7 నుంచి 8 ఫైరింజన్లను పంపించగా.. మంటల తీవ్రత పెరగడంతో మొత్తం 24 ఫైరింజన్లను రంగంలోకి దింపారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ డివిజనల్ ఆఫీసర్ ముకేశ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చామని, ప్రాథమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదుకాలేదని ఆయన చెప్పారు.

బాల్మీకి బస్తీ ప్రాంతంలో నివాస గుడిసెలతో పాటు ప్లైవుడ్ నిల్వ కేంద్రాలు, ఇతర గిడ్డంగులు ఉండటంతో భారీగా కలప సామగ్రి మంటలకు ఆహుతై అగ్ని వేగంగా వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు.