ఢిల్లీలోని పాతబడిన ఏడు ప్రభుత్వ నివాస కాలనీలను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రజలకు సంబంధించి పన్నుల రూపంలో వచ్చిన డబ్బును ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. సరోజినీ నగర్, నేతాజీ నగర్, నౌరోజీ నగర్, కస్తూరిబా నగర్, త్యాగరాజ్ నగర్, శ్రీనివాసపురి, మహమ్మద్పూర్ వంటి సుమారు 537 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాల్లో ఈ పనులు జరుగుతున్నాయి.

ఈ కాలనీల్లోని చాలా ఇళ్లు పాతబడిపోయి, నివాసానికి ప్రమాదకరంగా మారాయి. దాదాపు 40 శాతం ఇళ్లు ఉండటానికి వీలు లేని స్థితికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో 20 వేలకు పైగా ఇళ్ల కొరత ఏర్పడింది. అందుకే పాతబడిన చిన్న బిల్డింగుల స్థానంలో.. అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక అపార్ట్మెంట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల 21,000 కొత్త ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. మార్చి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 2,722 కొత్త ఫ్లాట్లను ప్రారంభించనున్నారు.

అలాగే సరోజినీ నగర్, నేతాజీ నగర్ వంటి ప్రాంతాల్లో మరో 6,632 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 537 ఎకరాల్లో కేవలం 13 శాతం భూమిని (అంటే సుమారు 69 ఎకరాలు) వ్యాపార సంస్థలకు లేదా ప్రైవేట్ నివాసాలకు కేటాయించి నగదుగా మారుస్తారు.

దీని ద్వారా సుమారు రూ.35,100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.32,800 కోట్లు. అంటే.. నిర్మాణ ఖర్చులు పోను ప్రభుత్వానికి అదనంగా మరో రూ.2,300 కోట్ల మిగులు ఆదాయం కూడా వస్తుంది. ప్రభుత్వ ఖజానాపై పైసా భారం పడకుండా.. వేలాది మంది ఉద్యోగులకు కొత్త ఇళ్లను అందించేలా ఈ పనులు జరుగుతున్నాయి.