ఓటీటీ వేదికగా తెలుగు ఒరిజినల్ కంటెంట్కు ఆదరణ పెరుగుతోందని జీ5 తెలుగు మరోసారి నిరూపించింది. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్పై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, కేవలం 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోడవ్వడంతో ఆడియన్స్ ఈ సిరీస్కు బ్రహ్మరథం పడుతున్నారు.
Also Read : Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం!
ఈ సిరీస్ కథాంశం విషయానికొస్తే.. ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన ఒక మధ్యతరగతి అమ్మాయి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, తన కూతురి కోసం తండ్రి పడే ఆరాటం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ప్రసాద్ రావు పాత్రలో రాజీవ్ కనకాల తన నటనతో జీవించగా, చాలా కాలం తర్వాత ఉదయభాను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తన మార్క్ చూపించారు. దర్శకుడు కృష్ణ పోలూరు ప్రస్తుత సమాజంలోని మహిళల భద్రత, హాస్టల్ లైఫ్, తల్లిదండ్రుల పెంపకం వంటి అంశాలను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించారు. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సిరీస్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.