Raghuveera Reddy: ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సీట్ల త్యాగాలు పెద్ద లెక్కేముంది.. దేశం ముఖ్యం..”ఇండియా” కూటమి లక్ష్యం అదే అన్నారు సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి.. నాలుగేళ్ల సెలవు తర్వాత, నేను ఏమీ అడగకుండానే పార్టీ అధినాయకత్వం గురుతర బాధ్యతలు ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి రాష్ట్ర ప్రజలు.. కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు.. అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తోందన్న ఆయన.. కర్నాటక లో ఘన విజయంతో కాంగ్రెస్ పూర్వ వైభవం పునఃప్రారంభంమైంది. తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడం, తదనంతరం ఏపీలో బలపడడం ఖాయం.. దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే విశ్వాసం నాకుందన్నారు రఘువీరారెడ్డి.
Read Also: India-Canada: ఇరు దేశాల మధ్య ఖలిస్థాన్ చిచ్చు.. వాణిజ్య చర్చలు వాయిదా..
కాంగ్రెస్ పార్టీతో సహా “ఇండియా” భాగస్వామ్య పక్షాలు సమిష్టిగా లోకసభ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకోవడం ఖాయం అన్నారు రఘువీరా.. “ఇండియా” కూటమి ఐక్యతను చూసి, పోటీగా ఎన్డీఏ కూటమి సమావేశాన్ని బీజేపీ నిర్వహించిందని దుయ్యబట్టారు.. గతంలో ఏనాడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంప్రదించని బీజేపీ.. “ఇండియా”ను చూసి భయంతోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిందని ఆరోపించారు రఘువీరారెడ్డి.. కాగా, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నత స్థాయి విధాన నిర్ణయాక సంఘం సీడబ్ల్యూసీ సభ్యుడుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నియామకమైన ఏకైక నాయకుడు రఘువీరారెడ్డి కావడం విశేషంగా చెప్పుకోవాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎమ్మెస్సార్ సీడబ్ల్యూసీలో సభ్యులుగా ఉన్న విషయం విదితమే.