ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా నేడు గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) , చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై జట్టు నిర్ణీత 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే కుప్పకూలింది.
టాప్ ఆర్డర్ దారుణ వైఫల్యం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆదిలోనే చుక్కెదురైంది. వర్షం కారణంగా పిచ్పై ఉన్న తేమను రాజస్థాన్ పేసర్లు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ తన నిప్పులు చెరిగే వేగంతో చెన్నై ఓపెనర్లను బెంబేలెత్తించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), సంజు శామ్సన్ (6), ఆయుష్ మాత్రే (0), మాథ్యూ షార్ట్ (2) వంటి కీలక ఆటగాళ్లు పవర్ప్లేలోనే పెవిలియన్ చేరడంతో చెన్నై కోలుకోలేని దెబ్బతింది.
నిరాశ పరిచిన మిడిల్ ఆర్డర్..
ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (17) కాసేపు పోరాడినా.. మాజీ సీఎస్కే ప్లేయర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. స్టార్ ఆల్ రౌండర్ శివం దూబే (6) ఒక భారీ సిక్సర్తో ఆశలు రేకెత్తించినా, ఆ తర్వాతి బంతికే రవి బిష్ణోయ్ పట్టిన అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ బౌలర్ బ్రిజేష్ శర్మ, క్రీజులో కుదురుకుంటున్న కార్తీక్ శర్మ (18)ను అవుట్ చేసి తన మొదటి వికెట్ ఖాతాను తెరిచాడు. నూర్ అహ్మద్ (1), మ్యాట్ హెన్రీ (5) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో చెన్నై 100 పరుగులైనా దాటుతుందా అన్న సందేహం కలిగింది.
ఆదుకున్న జేమీ ఓవర్టన్
జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో జేమీ ఓవర్టన్ (43 పరుగులు) ఆపద్బాంధవుడిలా నిలిచాడు. చివరి వికెట్కు అన్షుల్ కాంబోజ్తో కలిసి 32 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవర్టన్ తన పోరాట పటిమతో కొన్ని ఫోర్లు, సిక్సర్లు బాదడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.
బౌలర్ల పంజా..
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లతో చెన్నై నడుం విరిచారు. వీరికి తోడుగా సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ను ప్రదర్శించారు. రాజస్థాన్ రాయల్స్ ముందు ఇప్పుడు 128 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. పిచ్ బౌలింగ్కు అనుకూలిస్తుండటంతో, చెన్నై బౌలర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.