Crypto Fraud : జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం బయటపడింది. రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన రాకేష్ అనే వ్యక్తి తనకు తెలిసిన వారితో పాటు చాలా మందితో మంచి సంబంధాలు కొనసాగించాడు. తమతో మెటఫండ్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమతో రూ.7లక్షలు పెట్టించాడని.. మిగతా కొందరితో రూ.70 లక్షల దాకా పెట్టుబడులు పెట్టించాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తిరిగి రాకపోవడంతో వారంతా రాకేష్ ను నిలదీశారు.
Read Also : Bhupathi Raju Srinivasa Varma: కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం..
అడిగినప్పుడల్లా రేపు, మాపు అంటూ 8 నెలలుగా తమను రాకేష్ వెంట తిప్పించుకుంటున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరకు రాకేష్ ఇంటి అడ్రస్ కనుక్కుని బాధితులు అక్కడకు వెళ్లారు. రాకేష్ సమయానికి ఇంట్లో లేకపోవడంతో వారంతా ఆందోళన చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాధితులను కంప్లయింట్ ఇవ్వాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాకేష్ వెంటనే వచ్చి బాధితులతో మాట్లాడాడు. కొంత టైమ్ ఇస్తే డబ్బులు మొత్తం తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో వారంతా ఫిర్యాదు చేయకుండానే బయలు దేరారు. డబ్బులు అడిగినప్పుడల్లా రాకేష్ ఇలాగే దాటవేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.