Crude Oil Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముందు ఉంచిన ఒక అనూహ్యమైన కొత్త డిమాండే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇన్నాళ్లూ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతిలో ఉన్నాయనే వార్తలు వినిపించినప్పటికీ, ట్రంప్ ఎంట్రీతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 5 శాతం మేర పెరిగి బ్యారెల్కు 87 డాలర్ల మార్కును దాటేసింది. మరోవైపు అమెరికా డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ కూడా 4.50 శాతానికి పైగా పెరిగి 82 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇవే కాకుండా సహజ వాయువు (Natural Gas) ధరలు కూడా 4.60 శాతం లాభపడి 2.784 డాలర్లకు చేరడంతో గ్లోబల్ మార్కెట్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ హఠాత్ పరిణామానికి ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయమే కారణం. ఇరాన్ ప్రమేయం ఉన్న వివిధ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడిన అమెరికన్ల కోసం ఇరాన్ భారీగా నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇకపై అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ఏ చర్చల్లోనైనా ఈ పరిహారం అంశం ఖచ్చితంగా ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. గత ఐదు నెలలుగా సాగిన సైనిక ఘర్షణల్లో తమకు జరిగిన నష్టానికి పరిహారం కావాలని అంతకుముందు ఇరాన్ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన ట్రంప్, అది చాలా ఆసక్తికరమైన ఆలోచన అని వ్యాఖ్యానిస్తూనే, అదే తరహా డిమాండ్ను ఇరాన్ ముందు ఉంచి షాక్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని భావించినప్పటికీ, ఈ కొత్త ట్విస్ట్తో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. యుద్ధం ఆగినప్పటికీ, ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు 20 శాతానికి రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి (Hormuz Strait) విషయంలో ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శాంతి చర్చల్లో ఈ కొత్త మలుపు రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (Inflation) మరింత పెరిగే ప్రమాదాన్ని ముంగిట్లోకి తెచ్చిపెట్టింది.

