Husband Pushed His Pregnant Wife from Running Bus in Tamil Nadu: గర్భంతో ఉన్న భార్యను కట్టుకున్న భర్తే కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు. గర్భంతో ఉన్న మహిళ రోడ్డుమీద పడి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆదివారం (జనవరి 28) చోటుచేసుకుంది. భార్య మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వెంబార్పట్టికి చెందిన వెళ్లమెయ్యన్ కుమారుడు పాండియన్ (24), కల్వెలిపట్టికి చెందిన బాలమురుగన్ కుమార్తె వలర్మతికి (19) ఎనిమిది నెలల కిందట వివాహమైంది. వలర్మతి ప్రస్తుతం 5 నెలల గర్భిణి. దంపతులు ఇద్దరు ఆదివారం దిండిగల్ నుంచి పొన్నమరావతికి వెళ్లేందుకు గోపాల్పట్టి బస్టాండులో బస్సు ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న పాండియన్.. గర్భిణి అయిన వలర్మతితో గొడవపడ్డాడు. గొడవ పెద్దదైంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పాండియన్.. కనవాయిపట్టి సమీపంలో కదులుతున్న బస్సులోంచి తన భార్యను తోసేశాడు. రోడ్డుపై పడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Also Read: Kumari Aunty: ‘కుమారి ఆంటీ’ ఫుడ్ బిజినెస్ క్లోజ్.. కారణం ఏంటో తెలుసా?
బస్సు ఆపిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వలర్మతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందుతుడు పాండియన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై వలర్మతి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.