ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా…?కాదా అన్నది పక్కన పెడితే సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో వీర తెలంగాణ రైతాంగ పోరాట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో పాల్గొన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపేసి నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న ఉత్సవాలు జరిపే అర్హత కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లేదని ఆయన మండిపడ్డారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమన్నారాయన. తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బీజేపీ పార్టీ లేనేలేదన్నారు. బీజేపీ విమోచనం పేరుతో మోసం చేస్తుందని.. బీజేపీ, నైజాం విధానాలు ఒక్కటే…ఇద్దరు బ్రిటిష్ వారికి ఎజెంట్లుగా పని చేశారన్నారు. సాయుధ పోరాటంలో RSS, BJP పార్టీల నుంచి ఒక్కరైనా ఉన్నారా…ఆనాడు నైజాం భూ స్వాములని ప్రోత్సహిస్తే ఇప్పుడు కార్పొరేట్ శక్తుల్ని బీజేపీ ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.